2 చేపలకు రూ. 4 లక్షలు.. వాటికి ఎందుకంత ధర..?

2 చేపలకు రూ. 4 లక్షలు.. వాటికి ఎందుకంత ధర..?

మత్యకారులు వలలో అప్పడప్పుడు అరుదైన చేపలు చిక్కుతూ ఉంటాయి. పెద్ద పెద్ద చేపలతో పాటు.. మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న చేపలు పడుతూ ఉంటాయి. కొన్ని అరుదైన జాతులకు చెందిన చేపలు రూ.లక్షల్లోనే ధర పలుకుతాయి. అలాంటి చేపలు వలకు చిక్కితే మత్స్యకారుల పంట పడినట్లే. రాత్రికే రాత్రే లక్షాధికారి అయిపోతారు. తాజాగా.. కృష్ణా జిల్లా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడికి అరుదైన కచ్చిడీ చేపలు చిక్కాయి. ఆ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం ఫిషింగ్ హర్బర్‌లో వేలం వేశారు. వీటిని కొనేందుకు వ్యాపారలు ఎగబడ్డారు. ఓ వ్యాపారి అత్యధికంగా ఒక్కో చేపకు రూ. 2 లక్షల చొప్పున మెుత్తం రూ. 4 లక్షలకు రెండు చేపలను కొనుగోలు చేశాడు.

ఎందుకంత డిమాండ్..?
కచ్చిడీ చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. ఈ చేపల పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చేపలు అరుదుగా మత్సకారుల వలలో పడతాయని.. అలాంటప్పుడు వారి పంట పండినట్టే అని అంటున్నారు. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారని అంటున్నారు. ఆ చేప పేరులో ఉన్నట్లుగా నిజంగానే అది బంగారంలానే విలువ కలిగి ఉంటుందన్నారు. కచ్చిడీ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదని.. సముద్రంలో ఒక చోట నుంచి మరో చోటికి ట్రావెల్ చేస్తూనే ఉంటుందన్నారు. అలా ఎక్కడెక్కడో సుదీర్ఘ ప్రాంతాలకు తిరుగుతుందని.. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయన్నారు.

సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారన్నారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుందని చెప్పారు. పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలోనూ ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు కాస్ట్లీ వైన్‌ తయారు చేసే పరిశ్రమల్లో కచ్చిడీ చేపను ఉపయోగిస్తారట. ఈ చేప రెక్కలు వైన్‌ను క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉండటంతో లక్షలు వెచ్చించి వీటిని వ్యాపారులు కొనుగోలు చేస్తారు.