34కోట్ల భారీ ఫండ్ రైజింగ్​- సౌదీలో మరణశిక్ష ఖైదీ కోసం కేరళ ప్రజల దాతృత్వం

34కోట్ల భారీ ఫండ్ రైజింగ్​- సౌదీలో మరణశిక్ష ఖైదీ కోసం కేరళ ప్రజల దాతృత్వం

యూనిటీ చాటుకున్న మళయాళీలు 

సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన భారతీయ ఖైదీని విడిపించేందుకు నడుం బిగించారు కేరళ రాష్ట్ర ప్రజలు. ఇందుకోసం ఏకంగా రూ.34కోట్ల భారీ విరాళాన్ని సేకరించారు. ఇందులో కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 24కోట్ల విరాళాలను సేకరించారు. ఈ మొత్తాన్ని వీలైనంత త్వరగా సౌదీ ప్రభుత్వానికి అందజేసి రహీమ్​ను విడుదల చేయించనున్నారు.
కేరళ కొజీకోడ్​కు చెందిన అబ్దుల్ రహీమ్​ కొన్నేళ్ల క్రితం పని కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడే డ్రైవింగ్ చేస్తూ ఓ దివ్యాంగ బాలుడి బాగోగులు చూసే పనిలో చేరాడు. అయితే, ఈక్రమంలోనే 2006లో ప్రమాదవశాత్తు ఆ బాలుడి మరణానికి రహీమ్​ కారణమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు రహీమ్​ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీనిపై విచారించిన కోర్టు అతడికి 2018లో మరణశిక్ష విధించింది. దీనిపై 2022లో హైకోర్టులో అప్పీల్​ చేయగా ప్రతికూలంగా తీర్పు వచ్చింది. అనంతరం సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించగా కింద స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును వెలువరించారు. దీంతో సుమారు 18 ఏళ్లుగా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.

మరోవైపు రహీమ్​కు క్షమాభిక్ష పెట్టేందుకు బాలుడి కుటుంబసభ్యులను కోరగా వారు తిరస్కరించారు. చివరగా గతేడాది అక్టోబర్​లో సుమారు 34కోట్ల పరిహారాన్ని చెల్లిస్తే క్షమాభిక్ష పెట్టేందుకు అంగీకరించారు. దీనికి ఏప్రిల్ ​16ను చివరి గడువుగా పెట్టారు. అయితే, అంత పెద్ద మొత్తాన్ని రహీమ్ కుటుంబం చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఫండ్​ రైజింగ్​ను చేపట్టారు అతడి స్నేహితులు.

విరాళాల సేకరణ కోసం ముగ్గురు సభ్యులతో అబ్దుల్ రహీమ్​ ఫండ్ రైజింగ్​ కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా సేవ్​ అబ్దుల్ రహీమ్​ పేరిట ఓ మొబైల్​ యాప్​ను సైతం రూపొందించి విరాళాలు సేకరించారు. అనేక మంది స్వచ్ఛందంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మరీ విరాళాలు సేకరించారు. ఇప్పటి వరకు రూ.34,45,46,568కోట్లను సేకరించామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇక నుంచి ఈ విరాళాలు ఇవ్వడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. 2021లో ప్రారంభమైన ఈ కార్యక్రమం తీర్పు అమలుకు కొద్ది రోజులు ముందుగానే పూర్తి అయ్యింది.